దేశంలో సంపన్న ఎమ్మెల్యేల ఎవరు.. ఈ విషయం తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అందుకే ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనం చేసింది. దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యేకి రూ.1,400 కోట్ల ఆస్తులు ఉంటే.. అత్యంత పేద ఎమ్మెల్యేకి రూ.2000 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి.
దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన నిర్మల్కుమార్ ధారా అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచారు.
టీడీపీ అధినేతచంద్రబాబు నాయుడు రూ.668 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే జేఎస్ పటేల్ రూ.661 కోట్లతో 5వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఎస్ సురేష్ రూ.648 కోట్లతో 6వ స్థానంలో ఉన్నారు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.510 కోట్లతో 7వ స్థానం.. బీజేపీకి చెందిన పరాగ్ సింగ్ రూ.500 కోట్లతో 8వ స్థానంలో ఉన్నారు.
కర్ణాటకలో 14శాతం మంది ఎమ్మెల్యేలు ధనికులే.. వారి వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటేనని ఏడీఆర్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది.. అక్కడ మొత్తం 59 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కోటీశ్వరులు ఉన్నారు. 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 4,001 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ADR నివేదిక రూపొందించింది.
అంతేకాదు దేశంలో 4,001 మంది ఎమ్మెల్యేలలో 44 శాతం (1,777) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 28 శాతం మంది ఎమ్మెల్యేలు హత్యలు, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధిక సంఖ్యలో క్రిమినల్ కేసులు (70%), బీహార్ (67%), ఢిల్లీ (63%), మహారాష్ట్ర (62%), తెలంగాణ (61%), తమిళనాడు (60%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.