వరంగల్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల లేఖలు కలకలం రేపాయి. బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలనికి చెందిన ఉనికిచెర్ల గ్రామంలో కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామస్తులకు అండగా నిలుస్తామని మావోయిస్ట్ లు చెప్పారు. ఉనికిచెర్లలోని ప్రేమ్ కుంటను కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ లీడర్లు యత్నిస్తున్నారని.. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ లీడర్ల కబ్జాలు పెరిగాయని ఫైరయ్యారు. భూకబ్జాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్నారు. కొన్నిచోట్ల నామమాత్రపు కేసులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఉనికిచర్ల గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోరంబోకు భూములు, అసైన్డ్ భూములు, గుట్టలు, చెరువులు కబ్జాలు చేస్తునట్టు లేఖలో మావోయిస్ట్ లు ప్రచురించారు. అధికారుల అండదండలతో నాయకులు కబ్జాలు చేస్తు్న్నారన్నారు. నేతల భూకబ్జాలపై అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల మేధావులు గళం విప్పాలన్నారు. ప్రజల తరపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భూ కబ్జా దారులు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్ట్ నేత వెంకటేష్ పేరుతో లేఖ విడుదల చేశారు.