తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం క్రితం మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయన్న లేని లోటు పూడ్చలేనిది అన్నారు. కంటోన్మెంట్ను జిహెచ్ఎంసిలో కలపాలని ఆయన తపించారని, కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సాయన్న సేవలను కొనియాడారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.
మరోవైపు శాసనమండలిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మండలిలో సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి రైతులు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలుగా వీటిని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అధికార బరాసతో పాటు విపక్షాలైన కాంగ్రెస్, భాజపాలు కూడా కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి ఈ క్రమంలోనే పరస్పర విమర్శలు ఆరోపణలు ఇప్పటికే ఓరెత్తుతున్నాయి. ఈసారి సభా పర్వంలో కూడా ఆ వేడి వాడి కనిపించే అవకాశం ఉంది.