ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీలో జరిగే వచ్చే ఎన్నికల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేశానంటూ ఓ రిపోర్టును తెరపైకి తీసుకొచ్చారు. తాను రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరించి వచ్చిన వాస్తవాలను ఆధారంగా, కొన్ని సర్వే ఏజెన్సీలతో మాట్లాడినట్లు చెప్పారు.
ఈ సర్వే తో తాను ఒక అంచనాకు వచ్చానని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ నాడీ ఎలా ఉందో ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నట్లుగా వివరించారు. తమ పార్టీ అత్యంత దారుణంగా ఓటమి ఖాయమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 20 నుంచి 25 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలకు మించి గెలిచే అవకాశాలు కనిపించడం లేదన్నారు. 2009లో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అంతా తమ పార్టీకి బదిలీ అయిందని.. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, కొన్ని చోట్ల నోటాకు పోలైన ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు తక్కువగానే ఓట్లు వచ్చాయన్నారు.
రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు 6% ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది ఒక అంచనాగా వివరించారు. కారణాలేమైనా తన ప్రస్తుత పార్టీకి ముస్లిం మైనార్టీలు సింహభాగం దూరం కావడం ఖాయమన్నారు రఘురామకృష్ణ.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్వీకరిస్తే.. ప్రజలపై ఆమె ప్రభావం బలంగా ఉండనుందన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మరిన్ని తక్కువ స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 40 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.
ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ఖరారైతే.. ప్రజల్లో నెలకొన్న భయం తగ్గితే ఆ సంఖ్య 20 నుంచి 25 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లుగా ట్రెండ్ కనిపిస్తోందని అన్నారు.ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలనే చేసినప్పటికీ విఫలమయ్యారన్నారు. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా కలిసి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ తీవ్రంగా ప్రభావం చూపనుందన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ప్రజల్లో మనోధైర్యం రావలసిన అవసరం ఉందన్నారు రఘురామకృష్ణ.