Nitya Menon : ప్రముఖ నటి నిత్యా మీనన్ ఇటీవలి కాలంలో అడపా దడపా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తోంది. తాజాగా ఇండస్ట్రీలో తనకు శత్రువులు ఉన్నారంటూ సంచలనానికి తెరదీసింది. ఈ ముద్దుగుమ్మ మాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఇన్ని సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకోలేకపోయింది. అయితే అమ్మడికి కాస్త పొగరు ఎక్కువేనట. మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తరువాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
కాగా ఈ మధ్య నటి నిత్యామీనన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అమ్మడు తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా అమ్మడు పొగరుబోతుతనానికి మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్లో ధనుష్కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నిత్యామీనన్ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పింది.
Nitya Menon : వదంతులు ప్రచారం చేయడానికి వెనుకాడరు..
అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని నిత్యామీనన్ తెలిపింది. మనం ఎదుగుతున్నక్రమంలో మన కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని చాలా మంది గిట్టని వాళ్లు భావిస్తారని అన్నారు. ఇక వాళ్ల మాట వినలేదంటే ఇష్టానుసారంగా వదంతులు ప్రచారం చేయడానికి సైతం వెనుకాడరని పేర్కొంది. ఇండస్ట్రీలో నిత్యామీనన్తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, వారెవరూ అలా భావించలేదని తెలిపింది. కారణం తాను ఎలాంటి వ్యక్తినో తనతో నటించిన వారందరికీ తెలుసని నిత్య స్పష్టం చేసింది.