రాజకీయాల్లోకి పేద ప్రజల బతుకులు మార్చాలనే ఉద్దేశంతోనే వచ్చాను కానీ అద్భుతాలు సృష్టించడానికి రాలేదని.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
తాజాగా తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు, నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకే తాను పోరాడుతున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకొని ముందుకు వెళ్తున్నామని పనవ్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలన్నారు. మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
తాను, తన కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణం, కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు.. సచివాలయ వ్యవస్థ దేనికని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయిందని తెలిపారు. ప్రజల మాన, ప్రాణాలకు భంగం కలిగిస్తే తన అభిమాని అయినా సరే శిక్షించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్త పై ఒక మహిళా సీఐ చేయి చేసుకోడం పై మండిపడ్డారు. ఈ చర్యకి నిరసనగా రేపు శ్రీకాళహస్తి కి వెళ్తున్నట్టు ప్రకటించారు.