తాజాగా ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఒంటరి మహిళలు, వితంతుమహిళల వివరాలు సేకరించి పూర్తి సమాచారాన్ని సంఘవిద్రోహశక్తులకు వాలంటీర్లు అందిస్తున్నారు అని పవన్ చేసిన వ్యాఖ్యలకి రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి.
పరుచోట్ల జనసేన అధినేత దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు వాలంటీర్లు, మహిళా సంఘాలు. గోడలపై ఉన్న పవన్ పోస్టర్లను చించి వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత తక్షణమే ఈ మాటలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే మహిళా కమిషన్ ఆయనను వెంటాడుతూనే ఉంటుందని కూడా హెచ్చరించారు.