ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దేశం కోసం నిరంతరం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తండ్రి నందమూరి తారక రామారావు ఆశీర్వాదం వలనే ఈ స్టాయికి ఎదిగానన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విశాఖ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఏపీ వేల కోట్లు అప్పులో కూరుకుపోయిందన్నారు పురంధేశ్వరి. కేంద్రం వేల ఇళ్లు కేటాయించిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇన్ని రోడ్డులు నిర్మిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోడ్లు నిర్మించిందో చెప్పాలన్నారు.
ఏపీలో రోడ్డులు గుంతలమయంగా ఉన్నాయని.. రైల్వే జోన్ ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించకపోవడమే అన్నారు. మన్యం ప్రాంతంలో ఉన్న బాక్సైట్ తవ్వకాలు చేసి జేబులు నింపుకుంటున్నారని.. ఏపీలో ఒక ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విచ్చలవిడిగా విద్యుత్ ఛార్టీలు పెంచుతున్నారని.. మద్యం పేరుతో దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు మరోసారి మోసపోవద్దని.. స్టీల్ ఫ్లాంట్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరుగుతోందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం వివిధ రూపాలలో తీసుకున్న అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఫిర్యాదులో పేర్కొన్నారు.నాలుగేళ్ల వైసీసీ పాలనలో రూ.7,14,625 కోట్లకు అప్పులు తీసుకున్నారన్నారు. రుణాలు, బాకాయిలు, మళ్లించిన నిధుల విషయంలో జగన్ సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అంతేకాదు గడిచిన తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లు ఒక్క పీఎమ్ఏవై కింద ఇచ్చిందని పురంధేశ్వరి గుర్తు చేశారు.
ఈ ఏడాది బియ్యం ద్వారా 10 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి అందిందని.. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రూ.12 వేలు ఇస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు.