త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ కానున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. జనసేన తమకు మిత్రపక్షంగా ఉందని, కలిసి పనిచేస్తామని తెలిపారు. జనసేనతో, బీజేపీ కలిసి జగన్ ప్రభుత్వం పై సమరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వీలునిబట్టి ఆయనతో సమావేశమవుతానని, పొత్తులపై కేంద్ర అధినాయకత్వానిదే తుది నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని పురందేశ్వరి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని, రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు సమకూర్చిందన్నారు పురందేశ్వరి. జగన్ సర్కార్ నాలుగేళ్లల్లో రూ.75 వేల 501 కోట్ల అప్పులు చేసిందని, ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రం అప్పులు చేయలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆర్ధిక వ్యవహారాల్లో హెచ్చరిస్తూనే ఉంటదని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి దృష్టికి రాష్ట్రంలోని ఆర్ధిక పరిస్థితిని తీసుకెళ్తామని వెల్లడించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైన కూడా రూ.8,300 కోట్లు అప్పు తెచ్చారని, అనధికార అప్పులే రూ.4 లక్షల కోట్లకుపైగా ఉందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం పరిధికి మించి అప్పులు చేసిందని, అనధికార అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అప్పులు పెట్టుకుని అభివృద్ధి ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నన్నీ కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలో లేవని, కోర్టులను కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు.