దళితులు, గిరిజనుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఏకైక మార్గదర్శి సూత్రంతో చేవెళ్ల డిక్లరేషన్ రూపొందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
నాగర్కర్నూల్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలు విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపునకు కృషిచేయాలన్నారు. జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో విజయం సాధించి ‘ఇందిరమ్మ రాజ్యానికి’ నాంది పలకాలన్నారు. జిల్లాలో స్థానిక నేతలు భరోసా ఇస్తే రాష్ట్ర స్థాయిలో వంద సీట్లు కైవసం చేసుకునే బాధ్యతను కాంగ్రెస్ నేతలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందు బయటపెట్టి ‘తిరగబడదాం…తరిమికొడదాం’ అనే నినాదంతో ప్రతి గడపకు తీసుకెళ్లాలన్నారు.
‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా, డయాలసిస్ రోగులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందజేస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను రూ.500కే సరఫరా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆరోగ్యశ్రీ కింద వైద్య బీమాను రూ.5 లక్షలకు పెంచుతామని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చరు.
- Read more Political News