రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకానికే పంగనామాలు పెట్టారని, రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్ అని, కేసీఆర్ను నమ్మి ఓటేస్తే మోసం చేశారని, పూటకో మాట, రోజుకో వేషం వేస్తున్నారని YSRTP అధినేత షర్మిల ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
రూ.లక్ష రుణమాఫీ చేయడానికి నాలుగు సంవత్సరాలుగా లక్షల మాటలు చెప్పారు తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలేదని షర్మిల తెలిపారు. రైతు బంధు పైసలను వడ్డీల కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నా కేసీఆర్ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మాట మీద నిలబడే దమ్ము సీఎం కేసీఆర్కు ఉంటే వెంటనే 31 లక్షల మంది రైతులకు రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని YSRTP అధినేత సవాల్ విసిరారు.
ప్రభుత్వ పథకాలకు ఇవ్వడానికి నిధులు ఉండవు కానీ, దేశ రాజకీయాలకు ఫండింగ్ చేసేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంటదని ఆరోపించారు. కేసీఆర్ని గెలిపించిన పాపానికి రైతన్నలు బ్యాంకుల దగ్గర దోషులుగా మిగిలిపోయారని అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అంటూ కేసీఆర్ను YSRTP అధినేత ప్రశ్నించారు.