గత రెండు నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మరీనా ఈ ఘటనపై గిరిజన సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తున్నారు. మణిపూర్లో మహిళలపై జరిగిన సామూహిక లైంగికదాడిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ క్రమంలో ములుగులో కాంగ్రెస్ అద్వర్యంలో ఆందోళన చేపట్టింది సీతక్క . ఈ నిరసనలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. . మహిళలపై జరిగిన ఈ అమానవీయ ఘటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. మణిపూర్లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.
అక్కడ జరుగుతున్న ప్రతి మారణ హోమం వెనుక మోడీ ప్రభుత్వ హస్తం ఉందని, 50 వేల మంది పోలీసులు ఉన్నా.. మణిపూర్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని , మానవ హక్కులకు కూడా రక్షణ లేకుండా పోయిందని మోడీ ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శించారు. మహిళలను అత్యంత కిరాతకంగా హింసించిన దోషులను కాపాడడం కోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీతక్క విమర్శించారు.
మణి పూర్లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని మోడీ పెదవి విప్పకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలిపారు. అక్కడ మానవ హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీతక్క అన్నారు.