జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది, వచ్చే నెల (ఆగస్టు) లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఉపాధ్యాయుల పోస్టుల నియామకాల కార్యక్రమాలు మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నోటిఫికేషన్ నుంచి భర్తీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అనివార్య చర్యలకి చోటివ్వకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ గత ఏప్రిల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని పేర్కొన్నారు. టీచర్ ఖాళీల భర్తీకి సంబంధించి పనులు మొదలు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా టీచర్ల బదిలీలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేతున్నామని, అందుకోసమే పారదర్శక విధానాన్ని తీసుకొస్తామని కూడా చెప్పారు. ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్నటువంటి విధానాలను కూడా పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు..