Telangana : తెలంగాణలో శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి మారుతారో తెలియడం లేదు. దీంతో పార్టీలన్నీ కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయనే టాక్ అయితే బలంగానే నడిచింది. కానీ ఆ తరువాత మంత్రి కేటీఆర్ అలాంటిదేం ఉండదని తేల్చి చెప్పడంతో ఊహాగానాలకు తెరపడింది. మళ్లీ ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందే మొత్తం అసెంబ్లీని రద్దు చేసేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చ ప్రస్తుతం టీఆర్ఎస్లో బీభత్సంగానే నడుస్తోంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నిక కీలకం కాబోతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే… బీజేపీ చేతిలో ఓడిపోతే… ఇక రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు మారిపోతాయి. భారీగా వలసలు తద్వారా అధికారమే టీఆర్ఎస్ నుంచి చేజారిపోతుంది. అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీ బాగా బలపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోతాయి. అది టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం కలిగిస్తుంది. నిజానికి ఇప్పటి వరకూ నల్గొండలో బీజేపీకి ఏమాత్రం బలం లేదనేది అక్షర సత్యం. కానీ ఇప్పుడు రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడంతో నల్గొండలో సీన్ మారిపోయింది. ఈ సమయంలో బీజేపీ అక్కడ గెలిస్తే టీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది.
Telangana : టీఆర్ఎస్ ఓడిపోయిందా.. రాష్ట్రం చేజారిపోయినట్టే..
ఇక మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాకుండా ఏకంగా కేంద్ర పార్టీనే రంగంలోకి దిగింది. రాజీనామా చేస్తే.. ఉపఎన్నికల్లో గెలిపిస్తామంటూ హామీ ఇచ్చింది. దీంతో బీజేపీ అధినేతలు గత ఉపఎన్నికల కంటే కూడా సీరియస్గా మునుగోడును తీసుకోబోతోందని అర్ధమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందా.. రాష్ట్రం చేజారిపోయినట్టే. ఆ తర్వాత ఫలితాలను ఊహించడం కూడా కష్టం. ఈ తరుణంలోనే ముందస్తుకు వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన తిరిగి ఉత్పన్నమైందని తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందే అసెంబ్లీ రద్దుపై ప్రచారం జోరందుకుంది.