Munugode : మునుగోడులో కమలం పార్టీ వ్యూహం మార్చుకుంటోంది. టీఆర్ఎస్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీసీ, ఉద్యమ నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. నిన్నటికి నిన్న ఇద్దరు మునుగోడు బైపోల్స్ స్టీరింగ్ కమిటీ కీలక సభ్యులు పార్టీ మారారు. వారిలో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఉప ఎన్నిక కోసం బీజేపీ ఏమేమీ వ్యూహాలు పన్నిందో అవన్నీ వారిద్దరికీ తెలుసు. అంటే బీజేపీ గుట్టు మొత్తం ప్రస్తుతం టీఆర్ఎస్ చేతిలో ఉన్నట్టే.
ఇప్పటి వరకూ బీజేపీ బీసీలకు పెద్ద పీట వేస్తోందంటూ ప్రచారం ఓ రేంజ్లో జరుగుతోంది. ఇప్పుడు పార్టీని వీడిన ఇద్దరు నేతలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఒక్క బూర నర్సయ్య గౌడ్ను టీఆర్ఎస్ నుంచి బీజేపీ లాగేస్తే.. రిటర్న్ గిఫ్ట్గా ఇద్దరు నేతలను బీజేపీ నుంచి టీఆర్ఎస్ లాగేసింది. దీంతో అధికార పార్టీని ఎలాగైనా దెబ్బకు దెబ్బ కొట్టాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా కమలం పార్టీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ టీఆర్ఎస్కు బీజేపీ ప్లాన్ రచిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పుతామని కమలనాథులు చెబుతున్నారు. టీఆర్ఎస్కు రిటర్న్ గిఫ్ట్ కాస్తంత గట్టిగానే ఇస్తామని చెబుతోంది. నిన్న అర్థరాత్రి మునుగోడులో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం నుంచే బీజేపీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఏమైనా కోవర్టులు ఉండొచ్చనే అనుమానాలు బీజేపీలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా పార్టీలో చేరిన వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.