BJP: తెలంగాణలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు ముందే ఈ రాజకీయ వలసలు మొదలు కాగా.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యాక అవి ఊపందుకున్నాయి. బీజేపీలోకి ఎక్కువ మంది నేతలు చేరుతుండగా.. దానికి కౌంటర్ గా టీఆర్ఎస్ కూడా బీజేపీ నాయకులను పార్టీలోకి చేర్చుకుంటోంది.
మునుగోడు ఉప ఎన్నిల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం.. టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతకంతకు బీజేపీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బీజేపీ నుండి దాసోజ్ శ్రవణ్ మరియు స్వామి గౌడ్ లను టీఆర్ఎస్ లోకి ఆకర్షించడం ద్వారా గులాబీ పార్టీ ధీటుగా బదులిచ్చింది.
ఇక తాజాగా మునుగోడు ప్రచారంలో భాగంగా బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుండి ఎవరూ పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన ఆయన.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అస్సలు నమ్మవద్దని అన్నారు. అదే సమయంలో బీజేపీ గెలుపుకు అంతా సిద్ధమైందని, అందుకే టీఆర్ఎస్ ఇలాంటి డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు.
BJP:
త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు.త్వరలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఇద్దు టీఆర్ఎస్ మంత్రులు కాషాయం జెండా కప్పుకోబోతున్నట్లు తెలిపారు. బీజేపీలోకి నలుగు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, మరో ఇద్దరు మంత్రుల కుమారులు చేరతారని.. చాలామంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. దీంతో ఇప్పుడు ఇంతకీ ఆ మంత్రులు, ఎంపీలు ఎవరనే చర్చ సాగుతోంది.