Amaravathi Farmers : అమరావతి రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రకు ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. దీంతో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం దగ్గర యాత్ర నిలిచిపోయింది. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను నిలిపివేసినట్లు చెబుతున్నారు. పాదయాత్రకు సన్నద్ధమైన రైతులను పోలీసులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఐడీ కార్డు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని షరతు విధించారు.
అటు రైతులు.. పోలీసుల వద్ద తమకు సంబంధించిన అన్ని ఐడీ కార్డులు ఉన్నాయని.. వాటిని దాచి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీకెండ్ ఆ తరువాత దీపావళి పండుగ నేపథ్యంలో కోర్టుకు సెలవులు ఉండటంతో తమ పాదయాత్రకు బ్రేక్ వేసినట్టు రైతులు చెబుతున్నారు. అమరావతి రైతులు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. రామచంద్రాపురంలో రైతులు బస చేస్తున్న ఫంక్షన్ హాల్ వద్దకు నేటి ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ఐడీ చూపించాలన్నారు.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని.. అనుమతి ఉన్న వాహనాలు కాకుండా మిగతావి అంగీకరించబోమన్నారు. ఈ క్రమంలోనే రామచంద్రపురంలో రైతులు వేచి ఉన్న విజయ ఫంక్షన్ హాల్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఐడీ కార్డు ఉంటే మినహా పాదయాత్రకు అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.