పీలేరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం నడుస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉన్నా కూడా పెద్దిరెడ్డికి ఎదురెళ్ళే ధైర్యం ఎవరూ చేయలేరు. చేస్తే వారు కచ్చితంగా జైల్లో ఉంటారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటంతో చేతిలో పవర్ పెట్టుకొని ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తున్నారు అనే విమర్శలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పీలేరులో టీడీపీ ఫ్లెక్సీలు కట్టారని టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు బనాయించి పీలేరు సబ్ జైలులో పెట్టారు. ఇక చంద్రబాబు వారిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళారు.
అక్కడ కొంత మంది వైసీపీ కార్యకర్తలు చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హడావిడి చేశారు. అయితే పోలీసులు వారిని నియంత్రించారు. ఇదిలా ఉంటే సబ్ జైలులో తమ కార్యకర్తలని పరామర్శించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి అక్రమాలకి త్వరలో ఫుల్ స్టాప్ పడే సమయం వస్తుందని తెలిపారు. పెద్దిరెడ్డి పనైపోయిందని విమర్శించారు. అధికారంలో ఉన్నాం కదా అని తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దారుణమైన చర్య అని అన్నారు. పోలీసులు కూడా వైసీపీ నాయకులకి వంత పాడుతూ తమ వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంత మంది మహిళలు వచ్చి తమ భర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసారని చంద్రబాబుకి తెలియజేసారు. అసలు సంఘటనకి సంబంధం లేకపోయిన కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ లు చేసారని అన్నారు. దీనిపై చంద్రబాబు రియాక్ట్ అయ్యి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కచ్చితంగా భవిష్యత్తులో ప్రతిదానికి పెద్దిరెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అలాగే కార్యకర్తలు అందరూ భయపడకుండా వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.