Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో భవిష్యత్తు యువతకి భరోసా కల్పించాలనే మంచి సంకల్పంతో ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం అవుతున్న కూడా ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ ఇంకా వెనుకబడే ఉన్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. దానికి కారణం ఆయన ఇప్పటికి సంస్థాగతంగా పార్టీని బూత్ లెవల్ లో నిర్మాణం చేసుకోకపోవడం ఒక కారణంగా చూపిస్తున్నారు. అలాగే తనకి ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు అని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అలాగే ఎంతసేపు వైసీపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వ హయాంలో టీడీపీ తప్పులని మాత్రం ఎత్తి చూపించడం లేదు.
అలాగే టీడీపీపై ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు పెట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రకటన రిలీజ్ చేసి ఖండించడం చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే సొంతగా ఏమర్జ్ అవ్వాలని అనుకున్నవారు ఆ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా తమని తాము చూపించుకోవాలి. ప్రజలకి భరోసా ఇవ్వాలి. తాము వస్తే ప్రజలకి ఎలాంటి మేలు జరుగుతుంది అని స్పష్టమైన వైఖరితో చెప్పే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా సుదీర్ఘ కాలం రాజకీయాలలో ఉంటాను. ప్రజలలో మార్పు వచ్చేంత వరకు పోరాటం చేస్తాను. తనకి వారు అధికారం ఇస్తే బోనస్, లేకపోయిన మార్పు కోసం ఫైట్ చేస్తాను అంటూ కూర్చుంటే సొంత పార్టీలోని నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారుకోవడం మొదలు పెడతారు.
మార్పు తేవాలని అనుకోవడం మంచిదే. అయితే దానికి అధికారం చేతులో ఉండటం చాలా అవసరం అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించడం లేదనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది. ఈ కారణంగానే రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ బలమైన వ్యూహాలతో ముందుకి వెళ్తూ ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం కార్యాచరణ కూడా ప్రకటించలేదు. అలాగే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వారాహి యాత్ర ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియడం లేదు. ఎలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వచ్చే ఎన్నికలలో బలంగా పనిచేయకపోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డిసైడ్ అయినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అందుకే ఆ పార్టీ ఊసే లేకుండా అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనే మాట వినిపిస్తుంది.