గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికాలో జరిగిన తానా సమావేశంలో సీతక్క పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించడం తో ఆ పార్టీలో చిచ్చు రేపింది. సీతక్కకు సీఎంగా అవకాశం ఉండదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంగా ఎవరికైనా అవకాశం దక్కవచ్చన్నారు. రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ గురించి చర్చ పక్కనపెట్టి కాంగ్రెస్ను గెలిపించేలా కృషి చేయాలని సూచించారు.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. సీఎంగా ఎవరికైనా అవకాశం లభించవచ్చని, ఇప్పుడు చెప్పలేమని తెలిపారు. ఈ పార్టీ లో అందరికీ అవకాశాలు ఉంటాయని, సీఎం అభ్యర్థి గురించి ప్రస్తుతం ఆ విషయం గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాకే అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం ఉందని అన్నారు, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు తెలంగాణలో పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసారు. ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం పని చేయడం లేదని, తన కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు.
కాంగ్రెస్పై ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ రైతులకు మంచి చేసే పార్టీ అని అన్నారు.