Munugode : మునుగోడు ఉప ఎన్నికకు సరిగ్గా రెండు రోజుల ముందు.. గాంధీ కుటుంబం హైదరాబాద్కు రానుంది. నిజానికి రాహుల్ భారత్ జోడో యాత్ర రేపే ప్రారంభం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏపీలో జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 1, 2 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరుకానున్నారు. స్వామికార్యం స్వకార్యం రెండూ ఒక్కసారే పూర్తవుతాయనో ఏమో కానీ గాంధీ కుటుంబం మొత్తం రానుంది.
రేపే రాష్ట్రంలోకి రాహుల్ ఎంట్రీ భారత్ జోడో యాత్ర.. ఆదివారం తెలంగాణలోకి ప్రవేశించనుంది. కర్ణాటకలోని రాయ్చూర్ నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా నారాయణ్పేట జిల్లాలోకి రాహుల్ ప్రవేశించనున్నారు. నవంబర్ 6 వరకూ కూడా తెలంగాణలోనే రాహుల్ జోడో యాత్ర కొనసాగనుంది. అంటే.. రాహుల్ యాత్ర ఈ నెల 23 నుంచి నవంబరు 7 వరకూ తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక 3న జరగనుంది. 6న ఫలితం వెలువడనుంది. అంటే మునుగోడు ఎన్నికకు ముందు వచ్చి ఫలితం వెలువడిన అనంతరం రాహుల్ వెళ్లనున్నారు.
తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో ఏఐసీసీ ముఖ్య నేతలందరూ హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా పాదయాత్రలో పాల్గొననున్నారు. అయితే ఇటు మునుగోడు ఉప ఎన్నిక అటు రాహుల్ పాదయాత్రకు ఏర్పాట్లు చేయడం కాంగ్రెస్ పార్టీకి పెను సవాలుగా పరిణమించాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం సరిగా లేకుంటే పరిస్థితేంటని నేతలు ఆలోచిస్తున్నారు. మరి మునుగోడు ఉపఎన్నికపై రాహుల్ ప్రభావం ఎంత ఉంటుందనేది వేచి చూడాలి.