ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులు ఉన్నారని అడిగితే వెంటనే చెప్పడం కష్టం. ఎందుకంటే ఒకరిద్దరు సలహాదారులు ఉంటే సులభంగా చెప్పొచ్చు. ప్రతి మంత్రిత్వ శాఖకి ఒక సలహాదారు. ఒక్కో విభాగానికి ఒక్కో సలహాదారు. ఒక్కో ప్రభుత్వ కార్యాలయంలో ఒక్కో సలహాదారు. చివరికి కమెడియన్ అలీకి కూడా మీడియా వ్యవహారాల సలహాదారు అనే ఒక కొత్త పదవి సృష్టించి కట్టబెట్టింది. ఇలా ఇబ్బడిముబ్బడిగా సలహాదారు పోస్టులని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సృష్టించి కావాల్సినవారందరికి కట్టబెడుతూ పోయింది. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన అధికారుల కంటే ఈ సలహాదారులకి ఎక్కువ జీతాలు ఇస్తూ వైసీపీ సర్కార్ నియామకాలు చేపట్టింది. ఒక్కొక్కరికి 2 లక్షల వరకు జీతాలతో పాటు అదనపు బెన్ ఫైట్స్ కూడా కల్పిస్తూ తమ కమ్యూనిటీలో ఉన్నవారికి అలాగే ఏదో ఒక రకంగా పార్టీ కోసం పనిచేసిన వారికి జగన్ రెడ్డి, సజ్జల కట్టబెట్టారు.
అయితే ఈ సలహాదారులని ఇబ్బడిముబ్బడిగా నియమించడంపై తాజాగా హైకోర్టు వివరణ అడిగింది. ప్రభుత్వంలో ప్రస్తుతం ఎంత మంది సలహాదారులు ఉన్నారు. వారికి ఎంత జీతాలు ఇస్తున్నారు. వారు ఏ రకమైన బాద్యతలు నిర్వహిస్తున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఒక నివేదిక సిద్ధం చేసి ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన సర్కార్ ఇప్పుడు సలహాదారుల నియామకంకి సంబందించిన నివేదిక సిద్ధం చేసే పనిలో పడింది. విభాగాల వారీగా ఉన్న సలహాదారులకి ఆయా శాఖలకి అప్పగించడంతో వారికి అప్పగించిన బాద్యతలని అడిగి తెలుసుకోవడం మొదలు పెట్టింది.
అయితే ఇదంతా కేవలం చట్టం నుంచి తప్పించుకొని ప్రభుత్వ ఉద్యోగులని బాధ్యులుగా చేయడానికే అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. సలహాదారులకి సంబందించిన పూర్తి డేటా బయటకి వచ్చి వారికి మూడేళ్ళ కాలంలో ఎంత జీతాలు ఇచ్చారనేది బయటపడితే అదో పెద్ద స్కామ్ గా మారే అవకాశం ఉందని, ప్రతిపక్షాలు కూడా దీనిని ఆయుధంగా చేసుకొనే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ సర్కార్ దీనిపై ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. వీలైనంత వరకు ప్రభుత్వం సలహాదారుల నియామకం అపవాదుని ఉద్యోగుల మీదకి నెట్టేసి తప్పించుకునే ప్రయత్నంలో ఉండనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.