Hit And Run : న్యూ ఇయర్ రోజు తెల్లవారుజామున 20 ఏళ్ల అంజలి సింగ్ను ఈడ్చుకెళ్లి చంపిన ఘటన యావత్ దేశమంతా సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలో కారు వెళ్లిన మార్గంలో మూడు పీసీఆర్ వ్యాన్లు, రెండు పికెట్లలో ఉంచిన సిబ్బంది ఈ ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో అందరినీ సస్పెండ్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు కమిషనర్. వీరంతా భయానక సంఘటన జరిగిన ఔటర్ ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న రోహిణి జిల్లాకు చెందిన పోలీసులు.
సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వీరిలో ఆరుగురికి పీసీఆర్ డ్యూటీ ఉండగా, ఐదుగురు పికెట్లు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమీషనర్ షాలినీ సింగ్ దర్యాప్తులో పోలీసు సిబ్బందిని దోషులుగా నిర్ధారించారు, ఆ తర్వాత హోం మంత్రి ఢిల్లీ టాప్ కాప్ను వెంటనే వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అంతేకాదు ఎఫ్ఐఆర్లో హత్య ఆరోపణలను జోడించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
ఈ కేసుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొనడంతో గుజరాత్ నుండి ఫోరెన్సిక్ నిపుణులను సంఘటన స్థలం నుండి సాక్ష్యాలు , నమూనాల సేకరణకు పిలిపించారు. డీసీపీ హరేంద్ర కె సింగ్ అభ్యర్థన మేరకు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన ఐదుగురు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఈ అంశంపై దర్యాప్తు చేస్తోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన వెంటనే ఐదుగురిని, నేరానికి సహకరించినందుకు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
కిటికీలు కిందకి ఉండి ఉండడంతో పాటు లోపల పెద్దగా సంగీతం వినిపిస్తున్నందున, తమ కారు కింద మహిళ ఇరుక్కుపోయిందని తాము తెలుసుకోలేకపోయామని నిందితులు మొదట చెప్పారు. అయితే, మహిళ కారు కింద ఇరుక్కుపోయిందని తెలిసిందని, అయితే భయంతో ఆగలేదని తర్వాత అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
20 ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం పార్టీ తర్వాత తన స్నేహితురాలితో కలిసి స్కూటర్పై ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 2 గంటల తర్వాత కారు ఆమెను ఢీకొట్టింది. ఆ సమయంలో ఆమె కాలు కారు ముందు చక్రంలో ఇరుక్కుపోయి, ఆమెను సుల్తాన్పురి నుండి ఉత్తర ఢిల్లీలోని కంఝవాలా వరకు సుమారు 13 కి.మీల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది.