Janasena Party: ఏపీ రాజకీయాలలో తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న జనసేనని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. యువత కోసం రాజకీయమంటూ జనసేన పవన్ కళ్యాణ్ ఏపీలో గత దశాబ్ద కాలము నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేదనే విమర్శలు రాజకీయ వర్గాలలో చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. ఇక 2024 ఎన్నికలలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆదిశగా అడుగులు మాత్రం వేయడం లేదని విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఓవైపు అధికార పార్టీ వైసిపి గ్రామ సారధులను నియమించుకొని ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా నారా లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన ద్వారా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ రెండు పార్టీలు నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను కూడా ఖరారు చేసుకునే పనిలో ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుగుదేశం వైసిపి రాజకీయాలు నడుపుతున్నాయి. అయితే మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ మాత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంలో మరింత ఆలస్యం చేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది. వచ్చే నెలలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది.
దీని తర్వాత ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి పవన్ కళ్యాణ్ వస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వరుస సినిమాలు ఒప్పుకొని వాటిని పూర్తి చేయడానికి కాల్ సీట్స్ కూడా ఇచ్చేసారని తెలుస్తుంది. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు పవన్ కళ్యాణ్ మరింత చేరువ కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో వరుస సినిమాలు ఒప్పుకోవడం ద్వారా ఏడాది కాలం పాటు వాటికి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది.
మరి ఈ పరిస్థితుల్లో వారాహి తో బస్సు యాత్ర అని చెప్పిన జనసేన ఎప్పుడు రాజకీయ క్షేత్రంలోకి అడుగు పెడతారు అనేది జనసైనికులు కూడా ఎదురుచూస్తున్నారు. జనసేన కార్యకర్తలు బలంగా పనిచేస్తున్న కూడా వారిని సరైన దారిలో నడిపించే నాయకత్వం చాలా నియోజకవర్గాలలో ఇప్పటికీ లేదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు జనసైనికులు కూడా అర్థం కాని ప్రశ్నగా ఉంది