CM KCR : గత కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విపక్ష నేతలతో కేసీఆర్ మరోసారి చర్చలు జరిపారు. కేంద్రంపై పోరుకు కేసీఆర్ చేసిన ప్రతిపాదనలకు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు సైతం సానుకూలంగా స్పందిస్తున్నట్లు ప్రగతి భవన్ విడుదల చేసిన ఓ ప్రకటన తెలియజేసింది. మొత్తానికి 18 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాలను టార్గెట్ చేసుకుని కేంద్రం మెడలు వంచేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
CM KCR : మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
దేశవ్యాప్త నిరసనలతో కేంద్ర ప్రభుత్వ అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కేసీఆర్ ప్రకటనలో వెల్లడించారు. ఈక్రమంలోనే నేడు తమ పార్టీ ఎంపీలకు సైతం దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటులో సర్కారు విధివిధానాలను ఎండగట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే నేటి మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. తెలంగాణకు నష్టం చేసే విధంగా కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై ఉభయ సభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు అందులో తెలిపారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలు.. అంటే ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు కేంద్రం గురి చేస్తోందని దీనిపై గట్టిగా నిలదీయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రూపాయి పతనంతోపాటు ఆర్థిక రంగంలో కేంద్రం అసంబద్ధ విధానాలపై పార్లమెంటులో నిలదీయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే ఉపాధి హామీ పథకం అమల్లో ద్వంద్వ వైఖరిని ప్రశ్నించాలని సూచించారు. ఈ మేరకు టీఆర్ఎస్తో కలిసి వచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కలుపుకొని పోవాలని నిర్ణయించారు. మొత్తానికి పార్లమెంటు సమావేశాలను టార్గెట్గా చేసుకుని సమరానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు.