KCR : తెలంగాణలో వారం పాటు వర్షాలు ఏకధాటిగా కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. నిన్న సీఎం కేసీఆర్ పలు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆయన చేసిన వ్యాఖ్యలే పెను సంచలనానికి దారితీశాయి. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద పరిశీలన, బాధితులను పరామర్శించేందుకుగాను ముఖ్యమంత్రి ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గోదావరి వరదలను చూస్తుంటే విదేశాల నుంచి క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. గతంలో లద్దాక్లో, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వరదలే చోటుచేసుకున్నాయని తెలిపారు.
KCR : అటు కేసీఆర్.. ఇటు తమిళిసై..
మొత్తానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వరదలు విదేశాల కుట్రేంటని నెటిజన్లు విస్తుబోతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైలు ఇద్దరూ ఒకే రోజున వరద ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం ఉదయం వరంగల్ నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకోగా… గవర్నర్ రైలులో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం చేరుకున్నారు. ఇద్దరూ వేర్వేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించారు. సీఎం ఏటూరునాగారంలోనూ పర్యటించగా.. గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గోదావరి వరద బాధితులకు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 10 వేల తక్షణ ఆర్థిక సాయం, రెండు నెలలపాటు 20కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తామన్నారు. గంగానదికి వరదల విషయంలో ఐఐటీ నిపుణులు చేసిన సూచనలతో కొంత వరదల నివారణ జరిగిందని, ఆ తరహాలోనే గోదావరి వరదల నివారణకు ఐఐటీ నిపుణులు, ఇరిగేషన్, సీడబ్ల్యూసీ నిపుణులతో కమిటీ వేసి త్వరలో అధ్యయనం చేపడతామన్నారు.