Komatireddy : ఒకవైపు మునుగోడు ఎన్నికకు పార్టీలన్నీ సమాయత్తమవుతుండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయి ఉండి తన సొంత జిల్లాకు అందుబాటులో లేకుండా పోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనికి కారణం లేకపోలేదు. మునుగోడులో బీజేపీ తరుఫున వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటరెడ్డి అటు తమ్ముడికి సపోర్ట్ నేరుగా చేయలేక.. అలాగని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండలేక ఫ్యామిలీతో సహా సైలెంట్గా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో కాల్ ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని స్థానిక నేతలకు సూచించారు. ఈ దెబ్బకు పీసీసీ తనదేనని సైతం చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తే అండగా ఉంటాడన్నారు. అన్ని వేళలా నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆదుకుంటాడని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఈసారి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఆడియో కాల్లో హామీ ఇచ్చారు. ఇక నిన్ననే ఆయన తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.
ఇక ఆస్ట్రేలియాలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే పాట పాడుతున్నారు. ఆస్ట్రేలియాలో వెంకటరెడ్డి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాను వెళ్లి ప్రచారం చేస్తే పది వేలు పెరుగుతాయి కానీ కాంగ్రెస్ పార్టీ అయితే గెలవదని బీజేపీయే గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఒకరకంగా అందుకే ఆస్ట్రేలియాకు వచ్చేశానన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. రూలింగ్ పార్టీకి సపోర్టింగ్ చేస్తున్నోళ్లకు డబ్బులు ఇవ్వలేమని.. మన ఆర్గనైజేషన్ అలాంటిది కాదన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తెలంగాణ కోసం కొట్లాడానన్నారు.