Mahesh Babu: నానమ్మ ఇందిరా దేవి మరణంతో మహేష్ కూతురు సితార వెక్కి వెక్కి ఏడ్చింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహేష్ తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో నానమ్మ మరణంతో మనవరాలు మహేష్ కూతురు సితార బాధ తట్టుకోలేక పోతుంది. ఇందిరాదేవి భౌతికకాయం వద్ద మహేష్ ఒడిలో కూర్చుని గుక్క పెడుతూ ఏడ్చింది. మహేష్ ఎంత ఓదారుస్తున్నా గాని.. సితార కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. మహేష్ కూతురికి నానమ్మ అంటే ఎంతో ప్రేమ. ఆమెను చూడటానికి తరచూ కూడా ఆమె ఇంటికి వెళ్లేదని సన్నిహితులు అంటున్నారు.
ఇదిలా ఉంటే మహేష్ తల్లి మరణం పట్ల సినీ మరియు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుండి పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం తెలిపారు. చిరంజీవి తన ట్విట్టర్ లో “శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను” అని స్పందించారు.
పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో “ప్రముఖ నటులు శ్రీకృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను”.. అని పార్టీ తరఫున పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.