Maniratnam: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ఎలాంటి సీన్ ని అయినా సినీ ప్రేక్షకులకు నచ్చేలా తీయగల సామర్థ్యం, ట్యాలెంట్ చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఉంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో డైరెక్టర్ మణిరత్నం పేరు టాప్ లో ఉంటుంది. ఈయన సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆయనతో కలిసి పని చేయాలని ఎంతోమంది నటులు కోరుకుంటారు.
మణిరత్నం తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ పేరుతో భారీ సినిమాను తెరకెక్కించడం తెలిసిందే. పీఎస్-1గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులో, హిందీలో మంచి ఆదరణ లభిస్తోంది. వంద కోట్ల వసూళ్లను రాబట్టగలిగిన ఈ సినిమా ఇప్పుడు కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది.
కాగా ఈ సినిమా మీద తమిళనాడులో కాస్త డివైడ్ టాక్ వస్తున్నా కానీ కలెక్షన్లు మాత్రం బాగా వస్తున్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు మణిరత్నం కొత్త సినిమాను మెచ్చుకుంటూ ఉండగా.. నాగార్జున కూడా తాజాగా ప్రశంసలు కురిపించారు. ఎంతో అద్భుతమైన సినిమాను తెరకెక్కించారని మణిరత్నాన్ని, అందులోని అద్భుతంగా నటించిన నటీనటులందరినీ ఆయన మెచ్చుకున్నాడు.
Maniratnam:
నాగార్జున కొత్త సినిమా ది ఘోస్ట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ‘నేను ది ఘోస్ట్ సినిమా గురించి మాట్లాడే ముందు పొన్నియిన్ సెల్వన్ గురించి మాట్లాడాలి. మణిరత్నంను అభినందించాలి. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని మరోసారి రుజువైంది. ఈ సినిమా ఆయన ఎన్నో ఏళ్ల కల. ఆ సినిమా గురించి నాతో చాలాసార్లు మాట్లాడారు. 1988లో ఆయనతో గీతాంజలి సినిమా తీసిన క్షణాలు నాకు ఎప్పటికీ మధురమైన జ్ఞాపకాలు. అతని పనితీరు ప్రశంసనీయం. అలాగే పొన్నియన్ సెల్వన్ టీం అందరికీ అభినందనలు చెప్పాలి. హీరో విక్రమ్, నా తమ్ముడు కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఏఆర్ రెహమాన్ అందరికీ పేరుపేరునా అభినందనలు. అందరూ కలిసి అద్భుతమైన సినిమాను అందించారు’ అని మాట్లాడారు.