Manirathnam : కరోనా మహమ్మారి అంతమైందనుకుంటే దశలు దశలుగా మానవాళిని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ మహమ్మారి బారిన లక్షల్లో సామాన్య ప్రజానీకంతో పాటు చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు పడ్డారు. అయితే చాలా మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కానీ కొందరు ప్రముఖులను మాత్రం కోల్పోవడం అత్యంత బాధాకరం. ప్రస్తుత తరుణంలో కొవిడ్ అంతమైందిలే అనుకుంటే ఫోర్త్ వేవ్ రూపంలో మళ్లీ తయారైంది. సరే పెద్దగా ప్రభావమేమీ చూపట్లేదు. ఏదో వస్తోంది.. హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన పని లేదు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తాజాగా సినీ ప్రముఖులుడు ఒకరు కరోనాతో హాస్పిటల్ పాలయ్యారు.
Manirathnam : ఆరోగ్య వివరాలను వెల్లడించని వైద్యులు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. తనకు పరీక్షల్లో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఇటీవల జులై 8న మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ టీజర్ లాంచ్ జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న మణిరత్నం ఆరోగ్య వివరాలను హాస్పిటల్ వైద్యులు వెల్లడించలేదు. అభిమానులు మాత్రం మణిరత్నం కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
ఫోర్త్ వేవ్ అనుకున్న తరుణంలో పెద్దగా కేసులు ఏమీ నమోదు కాకపోయినా.. ఇటీవల ఏకధాటిగా కొద్ది రోజుల పాటు వర్షాలు కురవడం కరోనాకు కేసులు పెరిగేందుకు దోహదపడుతోంది. వాతావరణ మార్పులతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే మరోమారు రాజకీయ, సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడగా… ఇప్పుడు కోలీవుడ్కి ఈ మహమ్మారి పాకింది. రెండు రోజుల క్రితమే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డానట్టు వెల్లడించింది. ఇప్పుడు మణిరత్నం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.