Minister Gudiwada Amarnath: ఏపీలో మూడు రాజధానుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను పేరుతో బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును న్యాయపరంగా రాజధానిగా గుర్తించారు. మూడు రాజధానులను అభివృద్ధి చేస్తామంటూ జగన్ చెప్పుకొచ్చారు. పారిపాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ రాజధాని అమరావతి రైతులతో పాటు ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించాయి.
అమరావతి రైతుల ఉద్యమానికి పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం చేస్తామంటూ రాజధాని రైతులు నడుం బిగించారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టులో మూడు రాజధానులు చెల్లవని తీర్పు ఇవ్వడం, అమరావతి రైతుల ఉద్యమంతో జగన్ సర్కార్ దిగివచ్చింది. మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసేసుకుంది. అయితే మరికొన్ని మార్పులు చేసి త్వరలో మళ్లీ మూడు రాజధానుల బిల్లును తెచ్చే అవకాశముందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలకు ముందు మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడతామంటూ చెప్పుకొచ్చారు. త్వరలో జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో మూడు రాజధానుల బిల్లుపై జగన్ చర్చించనున్నట్లు స్పస్టం చేశారు. ఎన్నికల మేనిఫోస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తు్న్నామని, ఇప్పటికే 90 శాతం హామీలను పూర్తి చేసినట్లు అమర్ నాథ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే మిగతా హామీలను నెరవేర్చుతామని తెలిపారు. అయితే మూడు రాజధానులపై మంత్రి అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Minister Gudiwada Amarnath: మూడు రాజధానులను కేంద్రం ఒప్పుకోవడం లేదు…
మూడు రాజధానులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలుపుతోంది. ఇటీవల అమరావతిలో బీజేపీ నేతలు పర్యటించారు. స్వయంగా మోదీ వచ్చి రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయడంతో.. బీజేపీ నేతలు కూడా ఏం మాట్లడలేని పరిస్థితి. కేంద్రం సపోర్ట్ చేసేందుకు సిద్దంగా లేకపోవడంతో జగన్ మూడు రాజధానుల బిల్లు తెచ్చినా లాభం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మళ్లీ బిల్లు తెచ్చినా కోర్టులో అడ్డుకట్ట పడే అవకాశముందని చెబుతున్నారు.