నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొంతకాలంగా అధికార పార్టీ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇంటలిజెన్స్ తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, దీని వెనుక అధికార పార్టీ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కోటంరెడ్డి ఈ స్థాయిలో సొంత పార్టీపై విమర్శలు చేసిన కూడా ఏ ఒక్కరు ఇప్పటి వరకు స్పందించలేదు. అడుగడుగునా తనకి అవమానం జరుగుతుందని కోటంరెడ్డి రగిలిపోతున్నారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడుగా ఉంటూ సొంత డబ్బుని పార్టీ కోసం ఖర్చు చేసానని ఇప్పుడు తనపైనే నిఘా పెట్టె పరిస్థితిలో వైసీపీ అధిష్టానం ఉండటం దారుణమని అన్నారు.
ఇక వైసీపీ అధిష్టానం తన విషయంలో అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ద్వజం ఎత్తిన కోటంరెడ్డి తాజాగా సోమవారం కార్యకర్తలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అలాగే తమ్ముడుతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇక ఈ చర్చలో భాగంగా వైసీపీ తన తమ్ముడు గిరిధర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆశచూపించి తనని తప్పించాలని ప్రయత్నం చేస్తుందని చెప్పినట్లు తెలుస్తుంది. ఒక వేళ అదే జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కార్యకర్తలతో చర్చించినట్లు సమాచారం.
అలాగే వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసే విషయాన్ని కూడా ప్రస్తావించినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇప్పటికే నెల్లూరు లో ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్టానం ఉద్వాసన పలికింది. ఇప్పుడు కోటంరెడ్డిని కూడా టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే నెల్లూరులో అధికార పార్టీ నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఇప్పుడు ఉన్న వారిపై కూడా ఇలా వేధింపులకి గురి చేస్తూ ఉండటం రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాలపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.