నందమూరి కుటుంబం అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రజలకి ప్రత్యేక అభిమానం ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం వారసులపై కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నందమూరి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభిమానిస్తూ ఉంటారు. ఆ అభిమానంతోనే చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూడా ఉన్నారు. ఏపీలో అయితే చాలా మంది నందమూరి ఫ్యామిలీ అభిమానులం మేము అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారి కుటుంబాన్ని అభిమానించే వారు కోట్లాది మంది ఉన్నా కూడా కుటుంబంలో ఉన్న విభేదాలు అభిమానులని బాధపెడుతూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మిగిలిన కుటుంబానికి కాస్తా దూరంగా ఉంటారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
కుటుంబ విభేదాల కారణంగా తమ తెలుగుదేశం వ్యతిరేక పార్టీలు నందమూరి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాయి. అయితే వీరి మధ్య అనుబంధం కొన్ని సందర్భాలలో బయటకి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వైసీపీ నాయకులు అసెంబ్లీలో జుగుప్సాకరం అవమానించారు. ఆ సమయంలో నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబుకి అండగా నిలబడ్డారు. అయితే వైసీపీ మాత్రం ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్ ని చంద్రబాబుకి దూరం చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. వారు దూరంగా ఉంటే తెలుగుదేశం పార్టీని బలహీనపరచవచ్చని వారి అంచనా. అందుకే ప్రతిసారి జూనియర్ ఎన్టీఅర్ ని పైకి లేపి బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్ ని అవమానిస్తూ మాట్లాడుతారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో తాను తెలుగుదేశం పార్టీలో భాగమే అని చెప్పారు. అయితే తారకరత్న హార్ట్ స్ట్రోక్ తో హాస్పిటల్ లో చేరడంతో ఇప్పుడు నందమూరి కుటుంబం అంతా కూడా మళ్ళీ ఒక్కటిగా కలుస్తున్నట్లు ఉంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాలకృష్ణకి ఫోన్ చేసి తారక్ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే చంద్రబాబుతో కూడా మాట్లాడినట్లుతెలుస్తుంది. ఇక బీజేపీలో ఉన్న పురందరేశ్వరి కూడా బెంగుళూరు వెళ్లి తారక్ ని పరామర్శించారు.
ఈ నేపధ్యంలో నందమూరి కుటుంబం అంతాకూడా తారక్ కారణంగా ఒకటిగా కలుస్తుందని టీడీపీ కార్యకర్తలు కొంత సంతోషంగా ఉన్నారు. తారకరత్న గతంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం త్వరలో వస్తాడని చెప్పాడు. ఇప్పుడు తారకరత్న పట్ల జూనియర్ చూపిస్తున్న అభిమానం చూస్తుంటే కచ్చితంగా అతను చెప్పే మాటలు నిజం అవుతాయని టీడీపీ అభిమానులు ఆశిస్తున్నారు.