YSRCP: ఏపీలో ప్రస్తుతం వైసీపీ హవా నడుస్తుంది అని చెప్పాలి. ఆ పార్టీలో ఉంటే కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో చాలా మంది నాయకులు ఉన్నారు. జగన్ చరిష్మా, సంక్షేమ పథకాలు మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకొని వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆ పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేలకి తిరిగి టికెట్లు వచ్చే అవకాశం లేదనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఆయా స్థానాలలో బరిలోకి దిగడానికి వ్యాపారవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
సొంత చరిష్మా లేకపోయిన వైసీపీ అనే బ్రాండ్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రజలలోకి వెళ్ళొచ్చు అని భావిస్తున్నారు. ఈ కారణంగానే రాజకీయాలలోకి రావాలని భావిస్తున్న వ్యాపారులు చాలా మంది జగన్ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే పార్టీ కోసం పెద్ద మొత్తంలో ఫండ్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. అలాగే ఉన్నత స్థానాలలో ఉన్న అధికారులు ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటుపై హామీ లభిస్తే స్వచ్చందంగా పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే కచ్చితమైన హామీతోనే పదవులకి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. అలాగే ఇప్పటికే పదవీవిరమణ చేసిన మాజీ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వైసీపీలో టికెట్లు కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా సామాజిక సమీకరణాలు, ఆర్ధిక బలం చూసుకొని బలమైన వారికి టికెట్లు ఇచ్చి కొత్తవారిని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. కొత్త ముఖాలు వస్తే ప్రజలలో కూడా వారి పట్ల ఓ రకమైన సానుకూలత ఉండే అవకాశం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందని తెలుస్తుంది.