మైథాలజీ ఫిక్షన్ ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న జోనర్. మొన్నటి వరకు ఇండియన్ సినిమా భాషల పరంగా విడిపోయి ఉండేది. అలాగే హీరోలు కూడా ఆయా బాషలకి మాత్రమే పరిమితం అయ్యి సినిమాలు చేసే వారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తుంది. యూనివర్సల్ కాన్సెప్ట్స్ పై ఎక్కువగా దర్శకులు, నిర్మాతలు ఫోకస్ పెట్టారు. అలాంటి కథలతో సినిమాలు చేస్తే అన్ని భాషలలో రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకి కనెక్ట్ అయితే కలెక్షన్స్ భారీగా వస్తాయి. అలా ఎవరేజ్ టాక్ వచ్చిన కూడా ఒటీటీ ఉండనే ఉంది. అన్ని భాషలతో కలిపి ఒటీటీ చానల్స్ తో ఒప్పందం చేసుకుంటే నిర్మాత నష్టపోకుండా బయటపడతాడు.
థియేటర్స్ లో టికెట్ రెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు తప్ప కమర్షియల్ సక్సెస్, రొటీన్ కాన్సెప్ట్, ఎవరేజ్ టాక్ వచ్చే మూవీస్ ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. హ్యాపీగా ఒటీటీలో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చు అని ధీమాగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రేక్షకులకి రీచ్ కావాలంటే కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే బెటర్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఎమోషనల్ గా పాన్ ఇండియా రేంజ్ లో అందరికి రీచ్ కావాలంటే పవర్ ఫుల్ కాన్సెప్ట్ దేవుడు, మతం, చరిత్ర. ఇలాంటి కథలని తెరపై చూసినపుడు ప్రేక్షకుడు వాటికి భాగా కనెక్ట్ అవుతాడు.
ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న దర్శకులు తమ కథలని అదే కోణంలో తీసుకెళ్తున్నారు. ఈ నేపధ్యంలో పీరియాడికల్ జోనర్ లో, హిస్టోరికల్ ఎలిమెంట్స్ తో సినిమాలుచేయడం, లేదంటే ఫిక్షన్ లో దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, దైవం అనే అంశాలని ముడిపెట్టి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నారు. బాహుబలి హిస్టోరికల్ ఫిక్షన్ మూవీగా రాజుల కథాంశంతో వచ్చి సక్సెస్ అయ్యింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా దేశభక్తి లైన్ తో పాటు రాముడు, హనుమంతుడి పాత్రలని హీరో పాత్రలకి అన్వయించుకొని కంటెంట్ చెప్పడంతో సూపర్ హిట్ అయ్యింది. అలాగే కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడిని కథలోకి తీసుకొచ్చారు.
అలాగే బ్రహ్మాస్త్ర సినిమా కూడా మన మైథాలజీలో ఉండే అస్త్రాలని కథా వస్తువుగా ఉపయోగించుకున్నారు. రీసెంట్ గా ఇండియన్ వైడ్ గా సెన్సేషన్ అవుతున్న కాంతారా సినిమా కాన్సెప్ట్ ని కూడా శివతత్వం, వైష్ణవం కలిపి భక్తి అనే ఎమోషనల్ పాయింట్ ని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చేసారు. ఇక త్వరలో రాబోతున్న రామసేతు హిందువులకి బాగా కనెక్ట్ అయ్యే అంశం. ఆదిపురుష్ సినిమా కథ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. సలార్ సినిమాలో కూడా కాళీమాతని రిఫరెన్స్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇవన్ని యూనివర్సల్ కాన్సెప్ట్స్ తోనే వచ్చి హిట్ అందుకున్నాయి. ఈ నేపధ్యంలో దర్శకుల ఆలోచన శైలి అడ్వాన్స్ మోడ్ లో కాకుండా ప్రాచీన కాలంలోకి తీసుకెళ్ళి కథలు చెప్పేలా మారిందని చెప్పాలి. మైథాలజీ ఎలిమెంట్స్ కి ఫిక్షన్ కథలని జోడించి చెప్పడమే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఫార్మాట్ గా మారిపోయింది.