Munugode bypoll : మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు సాగుతోంది. మొత్తానికి మునుగోడులో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తులు, బుజ్జగింపులు సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఫిక్స్ కాబట్టి ఆ పార్టీని మినహాయిస్తే.. అటు అధికార టీఆర్ఎస్లో, ఇటు కాంగ్రెస్లోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డే మరోసారి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాకర్రెడ్డి 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ ముందుగానే లేఖ రాసినప్పటికీ ఆయన పేరే వినిపిస్తుండటంతో నియోజకవర్గ నేతల్లో అసంతృప్తి పెల్లుబికింది. దీంతో నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్రెడ్డి రంగంలోకి దిగారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించారు. అనంతరం వారందరినీ తీసుకుని ప్రగతి భవన్కు తీసుకెళ్లి నచ్చజెప్పి పంపించారు. ఈ విజయం కీలకమని.. దీని కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
Munugode bypoll : మునుగోడులోనూ హుజూరాబాద్ ఫలితమే..
ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లేనని తెలిసింది. అయితే ఈ సంకేతాలు రావడంతోనే ఆశావహుల్లో ఒకరైన పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆర్థిక బలం చూసే టికెట్ ఇస్తే మునుగోడులోనూ హుజూరాబాద్ ఫలితమే పునరావృతమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో టీపీసీసీ నేతలు సైతం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం గాంధీభవన్లో వారితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఇతర నేతలు సమావేశం నిర్వహించారు. ఇకపోతే ఈ నెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హాజరయ్యే బహిరంగ సభతో రాజగోపాల్రెడ్డి ప్రచారపర్వం ప్రారంభం కానుంది. మిగిలిన పార్టీలు సైతం రంగంలోకి దిగే అవకాశం ఉంది.