ఏపీ రాజకీయాలలో రోజురోజుకి ప్రధాన పార్టీలు అన్ని కూడా విస్తృతంగా జనంలోకి వెళ్లి ఎన్నికల వేడిని పెంచుతున్నారు. గత ఎన్నికలలో ఊహించని విధంగా బోర్లా పడ్డ జనసేన పార్టీ ఈ సారైనా ప్రజల మద్దతు సొంతం చేసుకొని కచ్చితంగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని భావిస్తుంది. దీనికి గాను పవన్ కళ్యాణ్ అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టి ఒకదాని తర్వాత ఒకటిగా తన వ్యూహాలని అమలులో పెట్టుకుంటూ ముందుకి వెళ్తున్నారు. గత ఎన్నికల సమయంలో జనసేనకి ఓటు వేసిన టీడీపీకి ఓటు వేసిన ఒకటే అనే విషయాన్ని వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మారు.
దీంతో కచ్చితంగా గెలుస్తుందన్న స్థానాలలో కూడా జనసేన ఓడిపోయింది. 6 శాతానికి పైగా ఓటింగ్ సొంతం చేసుకున్న ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. ఇదిలా ఉంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే సాంకేతాలు ఉండటంతో పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో వీలైనంత ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. టీడీపీ బీ పార్టీ జనసేన అని అధికార పార్టీ చేస్తున్న ప్రచారానికి వీలైనంత వరకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా కోనసీమ జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జనసేన సిద్ధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సారి కచ్చితంగా బలంగా జనసేన పోటీలో ఉంటుందని జనసేనాని స్పష్టం చేశారు. అలాగే తాను బలంగా నిలబడతానని ప్రజలు నమ్మితే తనకి పవర్ ఇవ్వాలని అడిగారు. అలాగే అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ లేని ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రజలు తీసుకురావాలని కోరారు. అలాగే వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే ఎం చేస్తామనేది అక్టోబర్ తర్వాత పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై తన దగ్గర ప్రణాళిక ఉందని దానిని తెలియజేస్తానని చెప్పారు.