రాష్ట్రంలో గత మూడేళ్ళలో వైసీపీ అరాచకాలు, వైఫల్యాలని బలంగా ఎండగడుతూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం ఓ వైపు జనసేనాని చేస్తున్నారు. మరో వైపు చంద్రబాబు, నారా లోకేష్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే విపక్షాలని అడ్డుకోవడానికి రకరకాల జీవోలని తీసుకొస్తూ వారిని నిర్భంధించే ప్రయత్నం వైసీపీ సర్కార్ చేస్తుంది. అలాగే ప్రశ్నించే వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శించే వారిపై కూడా కేసులు పెట్టి సీఐడీతో వేధింపులకి పాల్పడుతున్నారు అనేది ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని అధికార పార్టీ వైసీపీ భావిస్తుంది. దానికోసం వ్యవస్థలని మేనేజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది.
అలాగే గ్రామ సారథులు పేరుతో బూత్ లెవల్ లో టీమ్ లని సిద్ధం చేసుకుంటుంది. అదే సమయంలో వాలంటీర్లు, పంచాయితీ అధికారులని కూడా వాడుకోవాడానికి సిద్ధం అవుతుంది. మరో వైపు ప్రతిపక్షాలని ప్రజలకి చేరువ కాకుండా వ్యూహాత్మకంగా తన అధికార బలాన్ని ఉపయోగించుకుంటుంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బెదిరింపులకి కూడా పాల్పడుతున్నారు అని చెప్పాలి. వారాహితో ఏపీలో పవన్ కళ్యాణ్ యాత్ర ఎలా చేస్తాడో చూస్తామని వైసీపీ నేతలు ఇప్పటికే వార్నింగ్స్ ఇస్తున్నారు.
అలాగే నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటాం అని, వారు ప్రజలకి సమాధానం చెప్పి యాత్ర చేయాలని మంత్రులే నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇక ఏపీ శాప్ చైర్మన్ అయిన బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకి వేసి నేరుగా పవన్ కళ్యాణ్ కి, టీడీపీ నేతలకి వార్నింగ్ ఇస్తున్నారు. జగన్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సైన్యం పని చేస్తుందని, ఆ ప్రైవేట్ సైన్యం మీ సంగతి చూసుకుంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు.
తన జగన్ జోలికి వస్తే కచ్చితంగా ప్రైవేట్ సైన్యం రంగంలోకి దిగుతుందని, వారు జగన్ కోసం ఏం చేయడానికి అయినా వెనకాడరని మీడియా ద్వారానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని నడుపుతున్న ఒక ముఖ్యమంత్రి ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు అంటే కచ్చితంగా పోలీసు వ్యవస్థకి సమాంతరంగా మరో వ్యవస్థని రన్ చేసినట్లే అవుతుంది. ఇది చట్ట వ్యతిరేకం అనే విషయం అందరికి తెలిసిందే. మరి బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి నేరుగా మీడియాలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదనే మాట విపక్షాల నుంచి వినిపిస్తుంది.