MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నిందితులైన నందూ, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని న్యాయవాది శ్రీనివాస్కు సిట్ నోటీసు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్ఐఆర్లో శ్రీనివాస్ పేరును సైతం చేర్చిన సిట్ నేడు మరోసారి ఆయనను విచారిస్తోంది. నందూ వద్ద రూ.55లక్షలు అప్పు తీసుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారని నోటీసులో సిట్ పేర్కొంది. నందకుమార్కు నెలకు రూ.1.10లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారని సిట్ నోటీసులో పేర్కొంది.
వడ్డీ చెల్లిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే వివరాలు సమర్పించాలని శ్రీనివాస్కు సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట ఎక్కడికి వెళ్లినా తనకు నందూనే టికెట్లు బుక్ చేస్తారని శ్రీనివాస్ వెల్లడించినట్లు పేర్కొంది. నందకుమార్ బుక్ చేసిన విమాన టికెట్ల వివరాలు ఇవ్వాలని నోటీసులో సిట్ పేర్కొంది. విచారణకు వచ్చేటప్పుడు తాము నోటీసులో పేర్కొన్న వివరాలన్నింటితో విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని నిన్న శ్రీనివాస్ను హైకోర్టు ఆదేశించింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈ నెల 21, 22న సిట్ విచారణకు లాయర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ నెల 21న తన శాంసంగ్ ఫోన్ను శ్రీనివాస్ సిట్ అధికారులకు అప్పగించారు. జులై వరకు వాడిన మరో ఫోన్ను సైతం అప్పగించాలని శ్రీనివాస్కు సిట్ తెలిపింది. పాత ఫోన్ పగిలినందున జూన్ 1న కొత్త ఫోన్ కొన్నట్లు శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు సిట్కు వెల్లడించారు. సిట్కు అప్పగించిన మొబైల్ ఫోన్లోనే ట్రావెల్ ఏజెన్సీ వివరాలు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు.
శ్రీనివాస్, ఆయన భార్య బ్యాంకుల ఖాతాల వివరాలు, పాస్ పోర్టు ఇవ్వాలని సిట్ ఆదేశించింది.