కొన్ని రోజులుగా .. జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి అడుగుపెట్టనుందనే వార్తలు టీ టౌన్లో సందడి చేస్తున్నాయి. తొలి సినిమా ఉప్పెనతో సెన్సెషన్ సృష్టించిన బుచ్చిబాబు సనా ఆ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నట్టు న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆ వార్తలపై జాన్వీ తండ్రి బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
అజిత్ హీరోగా నటించిన ‘వలిమై’ సినిమాకి బోనీ కపూర్ నిర్మాత. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఓ విలేకరి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా.. ‘ఇది సోషల్ మీడియాలో వస్తున్న పుకారు మాత్రమే అని కొట్టిపారేశారు. అది ఓ విచిత్రమైన ప్రదేశం. అందుకే అక్కడ ఎదో ఓ కొత్త రూమర్ పుట్టుకొస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ నటిస్తుందనేది కూడా అలాంటి ఓ రూమరే’ అని బోనీ కపూర్ కొట్టిపారేశారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకుల్లో శ్రీదేవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే జాన్వీ ఎప్పుడూ తెలుగు సినిమాలో నటిస్తుందని చాలామంది అభిమానులు ఎదుచూస్తున్నారు. ఇక్కడి అభిమానులు మాకు ఎంతో విలువైన వారు. అందుకే మీ అందరి కోరిక మేరకు కచ్చితంగా టాలీవుడ్ సినిమాలో తను నటించాలని నేనూ అనుకుంటున్నాను’ అని బోనీ తెలిపారు.