నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా నందమూరి హీరో తారకరత్న తీవ్ర అస్వస్థతకి గురైన సంగతి తెలిసిందే. హార్ట్ స్ట్రోక్ కారణం సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే కుప్పం హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఇక హాస్పిటల్ లో అతనికి ట్రీట్మెంట్ నిన్నమొత్తం కొనసాగింది. బాలకృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తారకరత్న ఆరోగ్యపరిస్థితిని సమీక్షించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని బాలకృష్ణ అందరికి ధైర్యం చెబుతూ వచ్చారు. ఇక తారకరత్న భార్య హాస్పిటల్ కి వచ్చాక అత్యవసర చికిత్స నిమిత్తం బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు.
అక్కడ ప్రస్తుతం తారక్ కి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న హార్ట్ స్ట్రోక్ తో హాస్పిటల్ లో చేరాడనే విషయం తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకి ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఫోన్ లో విషయం తెలుసుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర మొదలైన రోజే నందమూరి ఫ్యామిలీకి చెందిన తారకరత్న ఇలా హార్ట్ స్ట్రోక్ తో హాస్పిటల్ లో పడటంపై టీడీపీ శ్రేణులు కూడా టెన్షన్ పడుతున్నాయి. రాబోయే ఎన్నికలలో తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు.
ఈ నేపధ్యంలోనే గత కొంతకాలంగా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అందులో భాగంగానే కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. అయితే ఊహించని విధంగా అస్వస్థతకి గురి కావడంతో తెలుగుదేశం శ్రేణులలో కలవరం మొదలైంది. తాజాగా తారకరత్న హెల్త్ బులిటెన్ నారాయణ్ హాస్పిటల్ డాక్టర్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలియజేశారు. పూర్తిగా వైద్యసాయంతోనే అతను శరీరం పనిచేస్తుందని తెలిపారు. ప్రత్యేక వైద్యబృందం నిరంతరం పర్యవేక్షణలో ఉందని తెలిపారు. ఇక చంద్రబాబు కూడా తారకరత్న ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్ వైద్యులతో మాట్లాడుతున్నారు. ఇక తారకరత్న వేగంగా కోలుకొని మామూలు స్థితికి రావాలని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు.