ట్రాన్స్జెండర్లకు విద్యారంగంలో రిజర్వేషన్లు కల్పించకపోవడంపై తెలంగాణ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. థర్డ్ జెండర్ కమ్యూనిటీలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయడంలో జాప్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
థర్డ్ జెండర్ వ్యక్తి డా. రుతు జాన్ పాల్, 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, గైనకాలజీలో పీజీ కోర్సులో చేరేందుకు నీట్ పీజీ పరీక్షలకు హాజరైంది.
కౌన్సెలింగ్ సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ట్రాన్స్జెండర్ కోటాను అందించనందున జాతీయ వైద్య మండలి ఆమెను ఎస్సీ వర్గానికి మాత్రమే పరిగణించింది. దీనిని సవాల్ చేస్తూ రూతు జాన్ పాల్ హైకోర్టును ఆశ్రయించగా, జూన్ 20న పిటిషనర్కు ఎస్సీ కోటాకు మించి రిజర్వేషన్లు పొడిగించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. థర్డ్ జెండర్ రిజర్వేషన్లు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల పిటిషనర్ రెండు మూడు సార్లు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఏసీజే తెలిపారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వారం రోజుల గడువు కోరడంతో.. కేసు విచారణను జులై 27కి వాయిదా వేసింది.