Indira Devi: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణంతో ఆమె భౌతికకాయం వద్ద సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఒకే ఏడాది రెండు మరణాలు సంభవించటంతో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జనవరిలో పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించడం ఇప్పుడు భార్య ఇందిరాదేవి మరణించడం కృష్ణ తట్టుకోలేకపోతున్నారు.
సోదరుడు చనిపోయిన సమయంలో కరోనా కారణంగా అతన్ని చివరి చూపు చూడలేకపోయినా మహేష్ ఎంతగానో బాధపడ్డారు. అయితే ఇంతలోనే తల్లి మరణించడంతో మహేష్ మరింతగా కృంగిపోయారు. మంత్రి కేటీఆర్, విజయ్ దేవరకొండ, నాగార్జున, వెంకటేష్, సుకుమార్, త్రివిక్రమ్, గోపీచంద్, అడవి శేష్, మంచు విష్ణు, మంచు మనోజ్, రానా, తమన్ తదితరులు పద్మాలయ స్టూడియోలో ఆమె మృతదేహాన్ని సందర్శించి మహేష్ బాబుని ఓదార్చారు. ఇంకా చిరంజీవి అదే విధంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం వరకు పద్మాలయ స్టూడియోలో మృతదేహం నుంచి అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించటానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో తమ అభిమాన నటుడు కుటుంబంలో జరిగిన విషాదాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు హ్యాష్ ట్యాగ్ తో.. స్టే స్ట్రాంగ్ అన్న జత చేసి ట్రెండింగ్ చేస్తున్నారు.