Pawan Kalyan : ఏపీలో రాజకీయం రోజుకో రంగు పులుముకుంటుంది అంటారు. నిజమే నిన్న మొన్నటి వరకూ విమర్శల బాణాలు సంధించుకున్న వైసీపీ, బీజేపీ నేతలు నేడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీ, జనసేన భాయీ.. భాయీ కానీ నేడు ఆ పరిస్థితి లేదని జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్ధమవుతోంది. గతంలో అంటే ఓ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా పవన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొని మరీ గెలిపించాలని కోరారు. ఆ తరువాత జరిగిన ఉపఎన్నికలకు మాత్రం బీజేపీ తరుఫున ప్రచారం కాదు కదా అటు దిక్కు కూడా పవన్ చూడలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఒక్క జనసేన జెండా కూడా ఎగరలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ‘గోదావరి గర్జన’ పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కూడా పవన్కు ఆహ్వానం అందలేదు. తాజాగా.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్కు ఆహ్వానం అందకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంగా గ్యాప్ పెరిగిందనే వాదనకు బలం చేకూర్చింది.
Pawan Kalyan : గుడ్ మార్నింగ్ సీఎం సార్..
ఇక ఇప్పుడు ట్విటర్ వేదికగా పవన్.. వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఒకరకంగా ట్విటర్ వార్ను ప్రకటించారు. రోజుకో ట్వీట్తో కాకరేపుతున్నారు. ఏపీలో రోడ్ల దుస్థిని వ్యంగ్య ట్వీట్లతో ప్రస్తావిస్తూ ఒకరకంగా వైసీపీ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు. ‘హ్యాష్ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్’ పేరుతో సీఎం జగన్కు కార్టూన్ కౌంటర్ ఇస్తున్నారు. రోడ్ల దుస్థితిని అధికారులు జగన్కు వివరిస్తున్నట్టుగా కార్టూన్ను డిజైన్ చేశారు. నిన్న చేసిన ట్వీట్లో.. సీఎం అర్ధం కానట్టు చూస్తుంటారు. దీనికి ‘అదే సార్ రోడ్లు అంటే సైకిళ్లు, బైక్లు, బండ్లు , బస్సులు, కార్లు నడుపుతారే అదన్నమాట’ అని అధికారులు సీఎంకు వివరిస్తారు. దీనికి కొనసాగింపుగా.. ‘మనం ఎప్పుడూ హెలికాఫ్టర్లో వెళతాం కదా మనకు పెద్దగా గుర్తుండవు…. పట్టించుకోం..’ అని సీఎంకు వివరిస్తారు.
ఇక నేడు రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్లా ఉంటుందన్నట్టుగా మరో వ్యంగ్య ట్వీట్ను పవన్ ట్విటర్లో షేర్ చేశారు. హెలికాప్టర్లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన ఉన్న మరో గోతిలో ఉన్న నీళ్ళలో బండ్లు పడిపోతుంటాయి. వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రోడ్ల దుస్థితిని చాలా ఫన్నీ వేలో వివరిస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. మొత్తానికి పవన్ తన ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వానికి భారీ ఝలకే ఇస్తున్నారు.