దిల్ రాజుకి సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ బాగా కలిసొస్తుంది. ఎంత పెద్ద సినిమా పోటీలో కూడా ఉన్న ప్రతి సంక్రాంతికి తన ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా ఉండే విధంగా చూసుకుంటాడు. సెంటిమెంటల్ గా సంక్రాంతి సీజన్స్ తనకి బాగా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తూ ఉంటాడు. ఈ నేపధ్యంలో 2023 సంక్రాంతి సీజన్ కి కూడా ఓ పెద్ద సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ చివరి షెడ్యూల్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
అయితే అది సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా ఉంది. ఈ నేపధ్యంలో ఆ సినిమాని తట్టుకొని నిలబడటం కష్టం అనే మాట వినిపించింది. అయితే ఆదిపురుష్ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ మీద కొంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి. సినిమా కంటెంట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగోలేదనే భావన అందరిలో కలిగింది. ఇదే సమయంలో వారసుడు రిలీజ్ డేట్ కూడా దిల్ రాజు ఫిక్స్ చేశారు. వారసుడు సినిమాని కూడా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఇలా వారసుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
ఆదిపురుష్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ప్రేక్షకులు ఆ సినిమాపై అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు అనే ఉద్దేశ్యంతోనే వారసుడు రిలీజ్ డేట్ ని దిల్ రాజు ఎనౌన్స్ చేశారా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఇండియన్స్ అందరూ గొప్పగా చెప్పుకునే ఒక దృశ్యకావ్యం రిలీజ్ కాబోతుంది అంటే ఒక తెలుగు ప్రేక్షకులు అందరూ మొదటిగా ఆ సినిమాని చూడటానికి ఇష్టపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అయిన ఆదిపురుష్ కి పోటీ లేకుండా వేరొక డేట్ ని ఎనౌన్స్ చేసి ఉండాల్సింది. అలా కాకుండా టీజర్ రిలీజ్ అయిన మరుసటి రోజే వారసుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం పలు సందేహాలకు తావిస్తోందని చెప్పాలి.