Jr NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే దీని తర్వాత హిందీలో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 మూవీ చేయనున్నారు. ఇక అది కంప్లీట్ చేసుకొని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి వెట్రిమారన్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.
ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటోందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత వెట్రిమారన్ సినిమాని తారక్ స్టార్ట్ చేస్తాడని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై తాజాగా వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు. విడుదల సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన అతను మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తారక్ తో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. తారక్ కి కలవడం జరిగిందని, అలాగే మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కూడా ఉంటుంది అనేది వాస్తవమేనని తెలిపారు. అయితే ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడానికి చాలా సమయం ఉందని అన్నారు.
తెలుగులో సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నానని ఈ సందర్భంగా వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు . ఆడుకాలమ్ సినిమా తర్వాత వడా చెన్నై స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ని కలవడం జరిగిందని తెలిపారు. అయితే కొన్ని కారణాల వలన తమ కాంబినేషన్ సెట్ కాలేదన్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసి కథ చెప్పడం జరిగిందన్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా కలిసానని పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో వారిని కలిసి కథలు నేరేట్ చేసానని తెలిపారు. ప్రస్తుతం చర్చల దశలో ప్రాజెక్ట్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. అయితే కచ్చితంగా తెలుగులో మూవీ ఉంటుందని, అయితే ఎప్పుడనేది చెప్పలేనని వెట్రిమారన్ తెలిపారు.