Viral Video: ఈ దైనందిక జీవితంలో మనిషికి మనిషికి మధ్య సంబంధాలు తగ్గుతూ వస్తున్నాయి. సొంత తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టని వాళ్లని కూడా మనం ఈ సమాజంలో చూస్తూ ఉంటాం. ఆఖరకు తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా రాని దౌర్భాగ్యులు ఉన్నారు. ఇలాంటి సమజాంలో ఒక కొండముచ్చు తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని తెలిసి విలవిలలాడింది. శవం వద్దకు కూర్చొని తలపై ముద్దు పెట్టి నివాళులర్పించింది. ఈ ఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… శ్రీలంక దేశంలోని తూర్పు ప్రావిన్స్లో బట్టికలోవా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒ కొండముచ్చును బాగా మచ్చిక చేసుకున్నాడు. ఆ కొండముచ్చు అతనితో చాలా స్నేహంగా ఉండేది. కొండముచ్చు రోజూ ఇంటికి వచ్చి అతడు పెట్టే ఆహారం తినేది. అలాగే అతనితో సరదాగా ఆడుకొనేది. ఈ క్రమంలోనే కొండముచ్చు, వ్యక్తి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.
వీరి మధ్య ఉన్న బంధం చూసి స్థానికంగా ఉండే ప్రజలు ముచ్చటపడేవారు. ఆయన తన కుటుంబసభు్యలతో కన్నా ఈ కొండముచ్చుతోనే ఎక్కువ సమయం గడిపేవారు. దురదృష్టవశాత్తు అక్టోబర్ 18న ఆ వ్యక్తి మరణించాడు. కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు.
Viral Video: ఏం జరిగింది.
అయితే రోజూలాగే ఆ కొండముచ్చు అతనిని చూడటానికి ఆయన దగ్గరకు వచ్చింది. కాని అతను కనపడలేదు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు మృతదేహం చుట్టూ గుమిగూడారు. దీంతో అతని మృతదేహం వద్దకు వెళ్లిన కొండముచ్చు.. అతడు చనిపోయాడని తెలియక ఆడుకొనేందుకు లేపే ప్రయత్నం చేసింది. ఎంతకూ లేవకపోయే సరికి.. కంటతడి పెడుతూ అతడికి ముద్దు పెడుతూ నివాళులర్పించింది. ఈ ఘటన అక్కడ ఉన్నవారి హృదయాలను కదిలించివేసింది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. వీడియో చూసిన అందరూ కొండముచ్చు ప్రేమను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు.