Telangana : తెలంగాణ సీఎం కేసీఆర్ రివర్స్ గేర్ వేశారు. విపక్షాలు విసరాల్సిన సవాల్ను ముందే ఆయన విసిరారు. ‘‘అసెంబ్లీని రద్దు చేస్తా.. ఎన్నికలు పెట్టే దమ్ముందా?’’ అని సవాల్ విసిరారు. తెలంగాణలో మరోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయనే దానికి ఇంతకు మించి నిదర్శనం ఏముంది? మొత్తానికి కేసీఆర్ తన ప్రకటన ద్వారా నర్మగర్భ సంకేతాలైతే ఇచ్చేశారు. మరి విపక్షాలేమైనా వెనకడుగు వేస్తాయా? అంటే సై అంటే సై అంటున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అని అంతా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. 2018లో సైతం కేసీఆర్ ముందస్తుకు వెళ్లి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Telangana : కీలక సమస్యల పరిష్కారంపైనే ఫోకస్
గతంలో ముందస్తు లేదని చెప్పిన కేసీఆర్ తాజాగా మాట మార్చారు. దీంతో విపక్షాలకే కాదు.. స్వపక్షానికి సైతం ముందస్తు ఎన్నికలుంటాయన్న సంకేతాలు ఇచ్చేశారు. ఈ దెబ్బకు అన్నిపార్టీలు రేపోమాపో ఎన్నికలన్నట్టుగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. చకచకా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని చక్కదిద్దే పనుల్లో ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారంపైనా ఫోకస్ పెట్టింది. ఇవన్నీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసమేనని విపక్షాలు సైతం ఓ నిర్ణయానికి వచ్చేశాయి.
సీక్రెట్గా మంతనాలు..
మరి విపక్షాలేమైనా తక్కువ తిన్నాయా? ఇప్పటికే బీజేపీ ఓ సర్వే చేయించి తమకు 30 స్థానాలు ఖాయమని తేల్చి చెప్పింది. ఇక మిగిలిన స్థానాలపై కూడా గురి పెడుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్తో దూసుకుపోతోంది. ఏమాత్రం లీకులకు తావివ్వకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతోంది. సీక్రెట్గా మంతనాలు జరుపుతోంది. రహస్య సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సైతం తమకు 70 స్థానాలు ఖాయమని చెప్పారు. బీజేపీ 30, కాంగ్రెస్ 70.. మరి టీఆర్ఎస్ మాటేంటి? ఇప్పటికే టీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత మరింత తీవ్రరూపం దాల్చక ముందే ఎన్నికలు నిర్వహించి ముచ్చటగా మూడో సారి అధికార పీఠం దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహం. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుంది? ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో వేచి చూడాలి.