YS Jagan: ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కానీ ఎలక్షన్ హడావిడి మాత్రం రాష్ట్రంలో మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. అధికారంలో ఉన్న వైసీపీ కదనోత్సాహంతో ముందుకు దూసుకెళుతోంది. ఈసారి 175 సీట్లు సాధించాలని జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలుపుకు ఢోకా రాకుండా జాగ్రత్తపడుతున్నారు
నిజానికి ఏపీలో ఎలక్షన్ కి ఇంకా టైముంది. కానీ వైసీపీ అధినేత ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని.. వైసీపీ ప్లీనరీలో పిలుపునివ్వడంతో అందరూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఊహించారు. అయితే ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై వైసీపీ అధినేత జగన్.. తాజాగా ఓ స్పష్టతనిచ్చారు. ఎన్నికలకు సంసిద్దతలో భాగంగా ప్రతి నియోజకవర్గం కార్యకర్తలతో మాట్లాడుతున్న జగన్.. కర్నూల్ జిల్లా ఆలూర్ నేతలతో సమావేశంలో ఎన్నికల మీద స్పష్టతనిచ్చారు.
ఎన్నికలకు ఇంకా 19 నెలలే గడువు ఉందని, ఎవరూ అలసత్వం చేయవద్దని వైయస్ జగన్ పార్టీ నేతలకు సూచించారు. అంటే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందనే విషయాన్ని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పని చేయాలని, అన్ని నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ఈసారి ముందుకెళదామని జగన్ అన్నారు.
YS Jagan:
రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు నెలలుగా గడపగడపకి కార్యక్రమం చేపట్టామని, అందులో వచ్చిన ఫలితాలను బట్టి మార్పులు చేస్తామని జగన్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని.. గత మూడేళ్లలో వైసీపీ చేసిన మంచి కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. అటు కర్నూలు జిల్లా ఆలూరులో పలు పథకాల ద్వారా మూడేళ్లలో రూ.1050కోట్లు అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో పరిస్థితి గురించి జగన్ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.