YS Jagan: మార్చిలో ఉగాది తర్వాత ఏపీలో కొత్త రాజకీయ వ్యూహాలు మొదలు కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి సిద్ధం అవుతున్న ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా తన స్ట్రాటజీని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ పానలని ఏకంగా పదిహేను సంవత్సరాలు చూసిన ఏపీ ప్రజలు మళ్ళీ చంద్రబాబుకి పట్టం కట్టడానికి సిద్ధంగా లేరు. అందుకే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటుంది. అయితే వైసీపీ మాత్రం వ్యూహాత్మక విమర్శలతో పవన్ కళ్యాణ్, టీడీపీ మధ్య మరింత దూరం పెంచుతున్నారు.
టీడీపీ చేసే చిన్న చిన్న తప్పిదాలని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నిజస్వరూపం అర్ధమయ్యేలా చేస్తున్నారు. దీని ద్వారా జనసేనాని కూడా వారికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఒక వేళ అదే జరిగితే రానున్న ఎన్నికలలో ప్రధాన పోటీ కచ్చితంగా వైసీపీ, జనసేన మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. సంక్షేమమే అజెండాగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలలోకి వెళ్తున్నారు. దీనిని ప్రతి ఇంటికి చేరువయ్యే విధంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఉగాది తర్వాత తనపై ఉన్న విమర్శలకి సమాధానం చెబుతూ ప్రజల మధ్యకి వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు.
ప్రతి వారంలో ఒకరు రోజు ఏదో ఒక గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా చేయడం వలన ప్రజలలో నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి కొంత యాంటీ ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి జగన్ పల్లె నిద్ర కార్యక్రమం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అలా చేయడం వలన ఆ నియోజకవర్గంలో ఓటింగ్ పై ప్రభావం చూపించవచ్చు అనేది జగన్ వ్యూహంలో భాగంగా ఉన్నట్లు తెలుస్తుంది.